వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగింది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్.. అక్రమాస్తుల కేసులో రేపు నాంపల్లిలోని న్యాయస్థానంలో హాజరుకావాల్సి ఉంది. దీంతో హైదరాబాద్ వెళ్లేందుకు ఈరోజు మధ్యాహ్నం ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం బయలుదేరేందుకు సమయం ఉన్నందున వీఐపీ లాంజ్లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో జగన్ వద్దకు వచ్చిన శ్రీనివాసరావు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్ వద్దకు వచ్చిన శ్రీనివాస్ కోడిపందేల్లో ఉపయోగించే కత్తితో దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే సహాయకులు అడ్డుకోవడంతో జగన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తి ఎయిర్పోర్ట్లోని ఓ హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం జగన్ హైదరాబాద్ బయలుదేరారు.