గుంటూరు, శ్రీకాకుళం లోక్సభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని వైకాపా నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో రిటర్నింగ్ అధికారులు (ఆర్వో) సరిగా వ్యవహరించలేదని వైకాపా భావిస్తోంది. కొద్దిసేపటి క్రితం ఆ పార్టీ అధినేత జగన్తో గుంటూరు, శ్రీకాకుళం లోక్సభ స్థానాల అభ్యర్థులు మోదుగుల వేణుగోపాల్రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్తో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు.
గుంటూరులో తెదేపా అభ్యర్థి సుమారు 4వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లు ప్రకటించారని.. పోస్టల్ బ్యాలెట్ల అంశంపై అక్కడి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మోదుగుల ఆరోపిస్తున్నారు. అక్కడ పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓట్ల సంఖ్య దాదాపు 9వేలకు పైనే ఉందన్నారు. వాటిని లెక్కించకుండా తిరస్కరించారని.. వాటన్నింటినీ లెక్కిస్తే తన విజయం ఖాయమై ఉండేదని మోదుగుల జగన్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అలాగే శ్రీకాకుళం స్థానంలో తెదేపా అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 6వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతోనే గెలుపొందినట్లు ప్రకటించారని, అక్కడ కూడా సర్వీసు ఓట్లు ఎక్కువగా ఉన్నాయని.. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే అన్యాయం జరిగిందని నేతలు జగన్కు వివరించారు. ఈ విషయాలన్నింటినీ పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.