Road Accident: రాజమహేంద్రవరం గామన్ వంతెనపై ట్రావెల్ బస్సు బోల్తా.. ఒకరు మృతి, 25మందికి గాయాలు
Road Accident: ఏపీలోని రాజమహేంద్రవరంలో ఘోర ప్రమాదం జరిగింది. గామన్ వంతెనపై ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి మరణించింది. మరో 28మందికి గాయాలయ్యాయి. వీరిలో 10మందికి తీవ్రగాయాలయ్యాయి. మిగతావారికి స్వల్పగాయాలు అయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
రాజమహేంద్రవరం శివారు గామన్ వంతెనపై బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది ఈ ఘటన. విశాఖ నుంచి హైదరాబాద్ కు బుధవారం రాత్రి వి. కావేరి ట్రావెల్ బస్సు బయలు దేరింది. డ్రైవర్ నిర్లక్ష్యం, మద్యం మత్తులో ఉన్న కారణంగా అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. బస్సు బోల్తాపడిన విషయం తెలిసేసరికి ఆలస్యం కావడం, పోలీసులు, ఇతర సహాయ సిబ్బంది అక్కడికి చేరుకునే లోపు క్షతగాత్రులు గంటపాటు విలవిల్లాడారు.
ఘటనలో సోదరి ధనలక్ష్మితో కలిసి హైదరాబాద్ లోని ఓ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్తున్న విశాఖకు చెందిన హోమిని 21 అక్కడికక్కడే మరణించింది. తల, మొండెం వేరై నుజ్జునుజ్జువ్వడం కలచివేసింది. రాజమహేంద్రవరం నుంచి 6 అంబులెన్సులు కాతేరు కొంతమూరు మధ్య వంతెనపై ఘటనా స్థలానికి చేరాయి. క్షతగాత్రులను రాజమహేంద్రవరం జీజీహెచ్ కు తరలించారు. వీరంతా విశాఖ, అన్నవరం ప్రాంతాలకు చెందినవారుగా తెలుస్తోంది. వీరిలో 25ఏళ్లలోపు విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారు. క్రేన్ సాయంతో రాత్రి 1గంట సమయంలో బోల్తాపడిన బస్సును తొలగించి కింద ఉన్న మరికొందరిని రక్షించారు. వారంతా బస్సు కింద ఖాళీ ప్రదేశంలో ఇరుక్కోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.