వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనను మరో రోజును పొడిగించుకున్నారు. దీంతో సీఎం అనంతపురం, కడప జిల్లాల పర్యటన వాయిదా పడింది. కియా మోటార్స్ ప్రారంభోత్సవానికి కూడా జగన్ హాజరుకాలేకపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ కార్యక్రమానికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి హాజరుకానున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణంతో.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన మరో రోజును పొడిగించడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఆగష్టు 8కి బదులుగా.. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జగన్ సీమ జిల్లాల్లో పర్యటించనున్నారు.
అయితే, అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ తొలి కారును సీఎం జగన్ సమక్షంలో నేడు మార్కెట్లోకి లాంచ్ చేయాల్సి ఉంది. ఇప్పటికే కియా ప్రతినిధులు సీఎంను కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జగన్ కూడా అంగీకరించారు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో సీఎం 'అనంత' పర్యటన వాయిదా పడింది. దీంతో సీఎం జగన్ తరఫున ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. బుధవారం రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ తదితరులను కలిశారు. మొత్తంమీద వరుస భేటీలతో ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు జగన్.