ఆర్టీసీ కార్మికులకు సీఎం అభయం

Update: 2019-06-12 13:45 GMT

ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గారు. సీఎం జగన్‌ హామీతో సమ్మె ప్రతిపాదనను విరమించుకున్నారు. సమస్యలపై సీఎం నుంచి సానుకూల స్పందన రావడంతో పాటు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అధ్యయన కమిటీ నియమిస్తామన్న భరోసాతో సమ్మెను వరమిస్తున్నట్లు ప్రకటించారు.

నాలుగు దఫాలుగా చర్చల తర్వాత సీఎం జగన్‌ హామీతో ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె ప్రతిపాదనను విరమించుకున్నారు. కోట్లాది నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను నిలబెట్టడంతో పాటు పలు డిమాండ్లతో కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. గురువారం నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు, కార్మిక సంఘాలతో నాలుగు సార్లు చర్చలు జరిపారు. చివరగా బుధవారం సీఎం జగన్‌తో సమావేశమైన కార్మికులు సమ్మె నోటీసును ఉపసంహరించుకునేందుకు విరమిస్తున్నట్లు ప్రకటించారు.

బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆర్టీసీ సీఎండీ సురేంద్రబాబు, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు జేఏసీ నాయకులు సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు. కార్మికుల డిమాండ్లతో పాటు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే నిర్ణయంపై చర్చించారు. తర్వాత సీఎం నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఉన్నతాధికారుల హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించుకుంటున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో భాగంగా అధ్యయన కమిటీ ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం వల్ల తమ జీవితాల్లో వెలుగులు నింపిందని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ఇకపై తామంతా ప్రభుత్వ ఉద్యోగులేనన్న భరోసా వచ్చిందని దీనివల్ల సంస్థలోని 55 వేల మంది కార్మికులకు మేలు జరుగుతుందని అన్నారు.

ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర సర్కారు త్వరలో అధ్యయన కమిటీని నియమించనుంది. గతంలో ఆర్టీసీ ఎండీగా, డీజీపీగా పనిచేసి, పదవీ విరమణ పొందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. కమిటీలో కార్మిక సంఘాల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. కమిటీ నియామకంపై ప్రభుత్వం రానున్న రోజుల్లో జీవో జారీ చేయనుంది. రెండు నెలల్లో ఈ అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్టీసీ విలీనానికి విధివిధానాలు ఖరారు చేయనున్నారు.  

Tags:    

Similar News