తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు..
తెలంగాణ ప్రభుత్వంపై కరోనా పరీక్షల విషయంలో ఇప్పటికే ఎన్నో విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వంపై కరోనా పరీక్షల విషయంలో ఇప్పటికే ఎన్నో విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ పరీక్షలు చేయిస్తూ తప్పుడు లెక్కలు చూపుతుందని, అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర హైకోర్టు కూడా పలుమార్లు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కరోనా పరీక్షల విషయంలో మరోసారి కీలక ఆదేశాలు జారీచేసింది.
ఇవాళ హైకోర్టు మరోసారి తెలంగాణ ప్రభుత్వం డాక్టర్లకు పీపీఈ కిట్లు, మాస్కులు, రక్షణ పరికరాలు ఇవ్వడం లేదంటూ దాఖలైన పిటిషన్పై విచారించింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో వార్డుల వారీగా కరోనా కేసులను వెల్లడించాలని, వారిని ఆయా కాలనీ సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నిర్వహించాలంటూ ఐసీఎంఆర్ చెప్పిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలను వేగవంతం చేయాలని, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సిబ్బందికి షిఫ్ట్ల విధానం అమలుచేయాలని ఆదేశాల్లో పేర్కొంది. గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బందితో పాటు పోలీసులకు కూడా రక్షణ కిట్లు ఇవ్వాలని సూచించింది. కరోనా వైరస్కు సంబంధించి కీలక సమాచారం మీడియా బులెటిన్లో ఉండాలని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నందున వార్డుల వారీగా కేసుల వివరాలను ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 29లోగా నివేదిక సమర్పించాలని సూచించింది.
ఇక ఈ విచారణకు రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు హాజరయ్యారు. గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ, యాంటీ వైరల్ డ్రగ్స్ ప్రయోగాలు చేస్తున్నట్లు రాజారావు కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో 79 మంది వైద్యులకు కరోనా సోకినట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 5675 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3071 మంది డిశ్చార్జ్ కాగా.. 192 మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 2412 యాక్టివ్ కేసులు ఉన్నాయి.