ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అరెస్ట్
చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో భాగంగా పలువురు నాయకులతో పాటు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని కూడా శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆర్టీసీ కార్మికులు నిరవధికంగా చేస్తున్న సమ్మెలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, కార్మికనేతలు నేడు 'చలో ట్యాంక్బండ్' కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ కర్యక్రమానికి పోలీసులు అనుమతిని ఇవ్వలేదు. అయినప్పటికీ కార్మిక నేతలు పోలీసుల మాటను పట్టించుకోకుండా 'చలో ట్యాంక్బండ్' కార్యక్రమానికి సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా శుక్రవారం నుంచే కార్మికులు, కార్మిక నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
అయితే ఇదే క్రమంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని గోల్కొండ పోలీసులు శనివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ మిలియన్ మార్చ్ కార్యక్రమం నేపథ్యంలోనే ఆర్.కృష్ణయ్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని నల్లకుంట పోసీస్ స్టేషన్ కు తరలించారు. ఆయనతో పాటు పలువురు జేఏసీ నాయకులను కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకూ 170 మంది నాయకులను, కార్మికులను అరెస్ట్ చేసినట్లు సీపీ అంజనీకుమార్ ఓ ప్రకటనలో వెలువరించారు. పట్టణంలో శాంతి భద్రతలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.