బొల్లారం రాష్ట్రపతి నిలయంలో శీతాకాల విడిది: 26న రాష్ట్రపతి రాక
ప్రతి ఏడాది భారత దేశ రాష్ట్రపతిగా నియమితులైన వారు హైదారాబాద్ లోని రాష్ట్రపతి నిలయానికి వచ్చి 15 రోజుల పాటు శీతాకాల విడిది చేయడం గమనార్హం.
ప్రతి ఏడాది భారత దేశ రాష్ట్రపతిగా నియమితులైన వారు హైదారాబాద్ లోని రాష్ట్రపతి నిలయానికి వచ్చి 15 రోజుల పాటు శీతాకాల విడిది చేయడం గమనార్హం. అయితే ఈ ఏడాది కూడా బొల్లారం రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ నెల 26వ తేదీన రానున్నారు. దీంతో బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లపై మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాష్ట్రపతి భవన్కు వెళ్తారని ఆయన స్పష్టం చేశారు
రాష్ట్రపతి నిలయం పూర్తి వివరాలు..
ఈ రాష్ట్రపతి నిలయం సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో (25 వేల చదరపు అడుగుల ), దట్టమైన చెట్ల నీడలో నిర్మించారు. ఈ భవనాన్ని బ్రిటషు వారి పాలనలో అప్పటి వైస్రాయ్ నివసించడానికి నిర్మించారు. ఈ భవనంలో సుమారు 20 గదులకు పైగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అతిథుల కోసం, కార్యాలయ నిర్వహణకు, సమావేశాల ఏర్పాటుకు కేటాయించారు. కాలక్రమేణా ఈ భవనాన్ని నిజాం ప్రభువులు స్వాధీన పరచుకున్నారు. 1950లో కేంద్ర ప్రభుత్వం ఆ భవానాన్ని రూ.60 లక్షలకు కొని దక్షిణాదిలో రాష్ట్రపతికి విడిదిగా తీర్చిదిద్దారు. దీంతో ప్రతి ఏడూ రాష్ట్రపతి వారం నుంచి పదిహేను రోజులుండి విడిది చేస్తారు. అదే సమయంలో ఆయన్ని కలవాలనుకున్న నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రముఖులు వచ్చి కలుస్తారు.
సాధారణ సమయాల్లో రాష్ట్రపతి నిలయంలో సామాన్యప్రజలకు ప్రవేశం ఉండదు. కానీ ప్రతి ఏడాది రాష్ట్రపతి శీతాకాల విడిది తరువాత వారం రోజుల పాటు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించడానికి అనుమతిస్తారు.