ఫ్లైఓవర్‌పై నుంచి దూకబోయిన వ్యక్తి.. కాపాడిన సినీ నటుడు

Update: 2019-07-19 01:33 GMT

హైదరాబాద్‌లోని అత్తాపూర్ ఫ్లైఓవర్‌పై ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. బ్రిడ్జి పైనుంచి దూకడానికి ప్రయత్నించిన యువకుణ్ని స్థానిక సెలబ్రిటీ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న యువకులు కాపాడారు. అంతుకుముందే బ్రిడ్జి కింద గుమిగూడిన కొంత మంది రాళ్లు, కర్రలతో బెదిరిస్తూ అతడిని కిందికి దూకొద్దని హెచ్చరించారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి మతిస్థితిమం సరిగాలేదని తెలుస్తోంది. పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై నిన్న ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలానికి కారణమైంది. యువకుడి ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అత్తాపూర్‌లో సెలబ్రిటీ జిమ్ నిర్వహిస్తున్న నటుడు ఇంద్రసేన సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. వంతెన పైనుంచి దూకడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని గమనించిన ఇంద్రసేన.. తన జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తున్న కుర్రాళ్లను అప్రమత్తం చేశారు. వాళ్లు హుటాహుటిన తమ బైక్ తీసుకొని బ్రిడ్జ్‌పైకి వెళ్లి ఆ వ్యక్తిని వెంట తీసుకొచ్చారు.

ఫ్లైఓవర్ పైనుంచి దూకే ప్రయత్నం ఎందుకు చేశావంటూ ఆ యువకుణ్ని ప్రశ్నించగా అతడు పొంతన లేని సమాధానం చెప్పాడు. బ్రిడ్జి పైనుంచి దూకితే మోదీ స్కార్పియో ఇస్తారని తాను పేపర్లో చదివానని అందుకే దూకుతున్నానని అతడు చెప్పడంతో వారు ఖంగుతిన్నారు. ఆ వ్యక్తికి మతిస్థిమితం సరిగాలేదని గుర్తించారు. అతడి మాటలను బట్టి ఉత్తరాదికి చెందిన యువకుడు అయుంటాడని వారు చెబుతున్నారు.  

Tags:    

Similar News