ప్లేట్లో ఎంగిలి నీళ్లు మీద పడ్డాయన్న కోపంతో ఓ యువకుడు కత్తితో ముగ్గురిపై దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇక ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లాకు చెందిన మహేష్బాబు తన స్నేహితులు రాకేష్, శివతేజ, ఆనంద్ తేజలతో కలిసి బీకేగూడలోని హిమాలయ డీలక్స్ బాయ్స్ హాస్టల్లో ఉంటూ సీఏ చదువుతున్నాడు. అయితే మంగళవారం రాత్రి భోజనం చేసిన తరువాత మహేష్బాబు నల్లా వద్ద ప్లేటు కడుగుతుండగా నీళ్లు కాస్తా పక్కనే ఉన్న శ్రీనివాస్ అనే యువకుడిపై పడ్డాయి. ఇక దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మహేష్ స్నేహితులు జోక్యం చేసుకుని వారికి సర్ధి చెప్పారు.
తరువాత ఎవరి గదిలో వారు పడుకున్నారు. అయితే ఈ ఘటనను మాత్రం శ్రీనివాస్ అవమానంగా ఫీల్ అయ్యాడు. ఎలాగైనా వారిపై పగతీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందరూ పడుకున్న సమయంలో వంటగదిలోకి వెళ్లి శ్రీనివాస్ కూరగాయలు తరిగే కత్తి తీసుకుని వచ్చి మహేష్తో పాటు వారి స్నేహితులపై దాడి చేశాడు. ఈ దాడిలో మహేష్ స్నేహితులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను చికిత్స నిమిత్తం దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నిందితుడు శ్రీనివాస్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.