ఇటీవల ఆమోదం పొందిన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేతలు ప్రజలను అనవసరంగా రెచ్చగొడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వారిపై మండిపడ్డారు. ఆదివారం సికింద్రాబాద్లోని పద్మరావునగర్లో బీజేపీ నేతలు 'గృహ సంపర్క్ అభియాన్' కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ముస్లింలను గౌరవిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నామని తెలిపారు.
భారత్ సర్వ మతాల కలయిక గల సెక్యులర్ దేశమని ఆయన అన్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడుల కారణంగా భారత్లోకి శరణార్థులు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శరణార్థులను ఆదుకోవడానికి, వారికి రక్షణ కల్పించడానికే పౌరసత్వం ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కానీ ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్, టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టం ఒక్క ముస్లింను కూడా వెళ్లగొట్టదని, దీనివల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. దీనివల్ల ముస్లింలకు అన్యాయం జరిగినట్టు, ఆకాశం ఊడిపడ్డట్టు, భూమి బద్దలైనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. బంగ్లాదేశీయులు హైదరాబాద్ లో సభ పెట్టుకొని మహిళలను కొట్టినప్పుడు మజ్లీస్ పార్టీ ఎక్కడ పోయిందో ఒవైసీ సమాధానం చెప్పాలన్నారు. దిగజారుడు రాజకీయాలు తగవని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.