Telangana: రాష్ట్ర కాంగ్రెస్ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదు: జగ్గారెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం పెద్ద గొప్పేంకాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం పెద్ద గొప్పేంకాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ఎన్నికల ఫలితాల వెల్లడించిన సందర్భంగా ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగారెడ్డిలో మేము ఓడిపోవడం మంచిదైందని, ఒక వేళ గెలిచి ఉంటే మేము మున్సిపల్ చైర్మన్గా ఏ పనీ చేయలేకపోయేవాళ్లమని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న పార్టీకి అంగబలం, అర్థబలం అన్నీ ఉంటాయని, అయినప్పటికీ కాంగ్రెస్ వారికి గట్టి పోటీని ఇచ్చిందని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి అనే చర్చే రాలేదని, టీఆర్ఎస్ డబ్బు ప్రభావంతోనే గెలిచిందని ఆయన ఎద్దేవా చేసారు. తమ పార్టీ వర్గాల వద్ద డబ్బులేదని, అందుకే తాము ఓటర్లను లోబరచుకోలేదని, కాబట్టే తాము ఓడిపోయామని తెలిపారు. అయినా కాంగ్రెస్ అధికార పార్టీపై పోరాడామని, గెలిచినా, ఓడినా ఎప్పుడూ కాంగ్రెస్ ఎప్పుడూ హీరోనే అన్నారు. ఓడినంత మాత్రాన తమ పార్టీ పట్ల ప్రజాదరణ లేదనుకోవడం పొరపాటే అని అన్నారు. ఎన్నికల బరిలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు 5, 10 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారని, ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇచ్చామని తెలిపారు.
కేసీఆర్ చెప్పినట్టుగా 100 స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేసిందని అన్నారు. ఈ కార్టీ గెలవడానికి కేసీఆర్ మాత్రమే కష్టపడలేదని, కేటీఆర్ కూడా దానికి కృషి చేసాడని అందుకూ ఆయన్ని అభినందిస్తున్నానని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలు కేసీఆర్ వైపే ఎందుకు నిలబడుతున్నారనేది కాంగ్రెస్ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో ప్రజల్ని కేసీఆర్ ఏ విధంగా మభ్యపెట్టాడో ఆ విషయాలను చూసి నేర్చుకుంటున్నానని అన్నారు. ఇకపోతే కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న సంగారెడ్డిలో కూడా టీఆర్ఎస్ జెండా ఎగరేసారని, దానికి మంత్రి హరీష్ రావు ఎంతో కృషి చేసాడని అన్నారు. ఇక ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడినంత మాత్రాన రాష్ట్ర కాంగ్రెస్ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.