దిశ అత్యాచారం, హత్య ఘటనలో నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులను కాల్చి చంపి ఎన్ కౌంటర్ గా చిత్రికరిస్తున్నారని, సర్వోన్నత న్యాయస్థానంలో ఇద్దరు లాయర్లు ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దిశ నిందితులను కాల్చి చంపిన పోలీసులపై చర్యలకు ఆదేశించాలని జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ కోర్టును కోరారు. ఈ నేపధ్యంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఢిల్లీకి వెళ్లారు. బుధవారం సుప్రీం కోర్టులో ఎన్కౌంటర్ ఘటనపై దాఖలైన పిటిషన్ విచారణ చేపట్టనుంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోర్టులో హాజరై ఈ ఘటనపై పూర్తి వివరాలు కోర్టు సమర్పించనున్నారు.
మరోవైపు ఎన్హెచ్ఆర్సీ బృందం ఎన్కౌంటర్పై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేస్తుంది. ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాలు కమిషన్ ఛైర్మన్కు నివేదిక ఇవ్వనుంది. దిశ హత్య అనంతరం నిందితులపై ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితుల మృతదేహాలను శుక్రవారం వరకూ భద్రపరచాలని ఆదేశించింది. దీంతో నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎఫ్ఐఆర్, ఎన్కౌంటర్కు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. దిశ ఘటనలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించరా అంటూ ప్రశ్నించింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు పాటిస్తే గురువారం కోర్టులో సమర్పించాలని ఆదేశించింది.
దిశ నిందితులను కాల్చి చంపిన పోలీసులపై చర్యలకు ఆదేశించాలని జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ కోర్టును కోరారు. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన 16 మార్గదర్శకాలను అమలు చేయాలని కోరారు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు, తెలంగాణ డీజీపీతో పాటు సైబరాబాద్ సీపీ సజ్జనార్ను ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐతో విచారణ చేయించాలని పిటినర్లు కోర్టును కోరారు.