నగరానికి మనిహారంగా ఉన్న మెట్రో రెండో కారిడార్ లో మెట్రో రైలు ఈ రోజు నుంచి పరుగులు తీయనుంది. నిత్యం రద్దీగా ఉండే మార్గంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకుగల మెట్రో లైన్ మార్గాన్ని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం 4గంటలకు ప్రారంభించనున్నారు. ఇందుకు గాను ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసారు. ఇక ఈ లైన్ ప్రారంభం కావడంతో నగరంలో 69 కి.మీ మెట్రోమార్గం అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మార్గం గుండా ఈ చివర నుంచి ఆ చివరకు చేరుకోవడానికి కేవలం 16 నిమిషాల సమయం మాత్రమే పట్టనుంది.
ఈ మార్గంలో జేబీఎస్ – పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, న్యూ గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్బజార్, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లు ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో వెళ్లే మెట్రో రైళ్లలో ప్రతి రోజు దాదాపు లక్షమంది ప్రయాణిస్తారని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు.
నగరంలో మెట్రో పనులకు ఎప్పుడు శ్రీకారం చుట్టారు...
ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఈ మెట్రో పనులకు శ్రీకారం చుట్టారు. 2008లో ఈ ప్రాజెక్టు ప్రణాళికలను రూపొందించగా 2012లో ఈ పనులను ప్రారంభమయ్యాయి. ఈ మెట్రో మార్గాన్ని 2017 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల వలన ప్రాజెక్టు పనులు మూడేళ్లు ఆలస్యం అయింది. నగరంలో మెట్రో పనులను పూర్తి చేయడానికి మెదటగా రూ.14,132 కోట్ల బడ్జెట్ ను వేసుకున్నప్పటికీ పెరిగిన ధరలతో పూర్తయ్యేనాటికి నిర్మాణ వ్యయం రూ.17,132 కోట్లకు చేరుకుంది.
మెట్రో కారిడార్ వివరాలుఇవీ..
♦ కారిడార్ 1 : మియాపూర్ – ఎల్బీనగర్ : 29 కి.మీ,
♦ కారిడార్ 2 : జేబీఎస్ – ఎంజీబీఎస్ : 11 కి.మీ,
♦ కారిడార్ 3 : నాగోల్ – రాయదుర్గ్ : 29 కి.మీ,