ప్రపంచ కప్ గెలిచే సత్తా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉందనేది అందరూ అంటున్న మాట. కచ్చితంగా కప్ గెలిచే జట్టుగా టీమిండియా పేరే మొదటి స్థానంలో ఉంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కూడా ఫేవరెట్లా లిస్టులో ఉన్నాయి. పలువురు విదేశీ క్రికెట్ పండితులు కూడా భారతే హాట్ ఫేవరేట్ అంటున్నారు. వారితో జత కలిశాడు వెస్టిండీస్ మాజీ క్రికెట్ దిగ్గజం మైకెల్ హోల్డింగ్ ప్రస్తుత భారత జట్టుకు ప్రపంచ ఛాంపియన్గా నిలిచే సత్తా ఉందన్నాడు. అయితే, జట్టు గెలవాలంటే ఇద్దరు ఆటగాళ్లు కీలకం అవుతారని పేర్కొన్నాడు.
'టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, డెత్ ఓవర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా.. ఈ ఇద్దరూ జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్లుగా ఉపయోగపడతారు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న క్రికెటర్లలో కోహ్లీ, బుమ్రానే ఉత్తమ ఆటగాళ్లు. భారత్కు ప్రపంచకప్ తెచ్చిపెట్టే సత్తా వాళ్లిద్దరికి మాత్రమే ఉంది. ఇంగ్లాండ్ తన సొంత గడ్డపై ప్రపంచకప్ పోరులో దిగుతోంది. ఇటీవల వన్డేల్లోనూ ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడుతోంది. జట్టు కూడా సమతూకంగా ఉంది. అయితే, ఇంగ్లాండ్కు సరైన జట్టేదైనా ఉందంటే అది కచ్చితంగా భారత జట్టే. ఈసారి ఇంగ్లాండ్ లేదా ఇండియా రెండింట్లో ఏ జట్టు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు' అని హోల్డింగ్ పేర్కొన్నాడు.
1983 ప్రపంచకప్లో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో మోహిందర్ అమర్నాథ్ బౌలింగ్లో చివరి బ్యాట్స్మెన్గా హోల్డింగ్ ఔటయ్యాడు. దీంతో విండీస్ను ఓడించిన భారత్ ప్రపంచ విజేతగా ఆవిర్భవించింది. కాగా మే 30 ప్రారంభం కానున్న మెగా టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్లో జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.