ఆ ఓటమిని వారు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ లీగ్ మ్యాచ్ లో పాక్ భారత్ చేతిలో ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఇది జరిగి రెండు రోజులు అయిపొయింది. కనీ, ఇంకా పాకిస్థాన్ ఆటగాళ్లపై.. ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్ పై పాక్ క్రికెట్ అభిమానులకు కోపం చల్లారలేదు. ఇప్పటికే కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్తో పాటు జట్టు ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్ఫరాజ్ శరీరంపై జోకులు... కీపర్ మాత్రమే కాదు, 'స్లీప్' ఫీల్డర్ అంటూ అతని ఆవలింతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జట్టు సభ్యుల ఫిట్నెస్పై పరిహాసాలాడారు. దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాటనూ పట్టించుకోలేదని విరుచుకుపడ్డారు. పాక్ ఆటగాళ్లను తిట్టడానికి దొరికిన ప్రతి అస్త్రాన్ని సంధించారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ కొత్త నినాదాన్ని షేర్ చేస్తున్నారు. మాకు కాశ్మీర్ వద్దు.. కోహ్లీ చాలు ఇచ్చేయండంటూ ఓ ఫోటో ఈరోజు నేట్టింట్లో హల్చల్ చేస్తోంది. నిజానికి ఇది ఫేక్ ఫోటో. ఎప్పుడో 2016 లో కొంతమంది కశ్మీర్ యువకులు స్వాతంత్ర్యం కావాలని బ్యానర్ ప్రదర్శించారు. ఈ ఫోటోను కొంత మంది ఇపుడు పాక్ పరాజయాన్ని వెటకారించడానికి వాడుకుంటున్నారు. దీనిలో వాస్తవంగా ఉన్న మాకు స్వాతంత్ర్యం కావాలి అని ఉన్న మాటను తీసేసి.. ' మాకు కశ్మీర్ అక్కర్లేదు.. కోహ్లినిస్తే చాలు' అని చేర్చారు. ఇప్పుడు ఈ ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది.