ప్రాధాన్యం లేని మ్యాచ్ క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచింది. వెస్టిండీస్ శ్రీలంక జట్ల మధ్య వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన మ్యాక్ లో భారీ స్కోరులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ రెండు జట్లు సెమీస్ అవకాశాలను కోల్పోయాయి. వీటిలో ఏది గెలిచినా టోర్నీలో ప్రభావం చూపించే అవకాశం లేదు. అయినా, ఈ మ్యాచ్ ఆద్యంతం చక్కని క్రికెట్ ను పంచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 6 వికెట్లకు 338 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో (104; 103 బంతుల్లో) సెంచరీ సాధించాడు. ఛేదనలో పూరన్ మెరుపు సెంచరీతో ఆఖరి వరకు పోరాడినా విండీస్ 9 వికెట్లకు 315 పరుగులే చేయగలిగింది.
వెస్టిండీస్ ఆరంభం పేలవం..
భారీలక్ష్యాన్ని (339) చేదిన్చాల్సిన క్రమంలో ఆదిలోనే వికెట్లను కోల్పోయింది విండీస్. 10 ఓవర్లకు 2 వికెట్లకు 37 పరుగులు మాత్రమే చేసింది. గేల్ (35), హెట్మయర్ (29) కాస్త ధాటిగా ఆడేందుకు ప్రయత్నించినా.. కీలక సమయంలో వెనుదిరగడంతో వెండీస్ 84/4తో కష్టాల్లో పడింది. అయితే పూరన్, హోల్డర్ (26)తో కలిసి పోరాటం కొనసాగించాడు. కీలక సమయంలో హోల్డర్, బ్రాత్వైట్ (8) ఔట్ కావడంతో విండీస్ ఓటమి దిశగా సాగింది. కానీ పూరన్ పట్టువదల్లేదు. వీలు చిక్కినప్పుడల్లా అతను సిక్స్లు, ఫోర్లు దంచి సాధించాల్సిన రన్రేట్ను అదుపులో ఉంచాడు. అతనికి తోడు అలెన్ (51; 32 బంతుల్లో) కూడా ధాటిగా ఆడడంతో విండీస్ విజయం దిశగా సాగింది. అలెన్ ఔటైనా.. లక్ష్యం (18 బంతుల్లో 31) చేరువగా ఉండడంతో విండీస్ గెలుస్తుందనిపించింది. అయితే మాథ్యూస్ వేసిన 48 ఓవర్ తొలి బంతికి పూరన్ వెనుదిరగడంతో విండీస్ పోరాటం ముగిసింది. పరాజయం అన్చులవరకూ చేరి.. విజయం దిశగా పయనించి.. గెలుపు ముందు బోర్లా పడింది విండీస్.