ప్రపంచకప్ టోర్నీలో ప్రదర్శన ఆధారంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన జట్టును ప్రకటించాడు. అయితే, ఈ జట్టులో ధోనీకి చోటు కల్పించలేదు. ధోనీకి బదులుగా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టోను వికెట్ కీపర్ గా ఎంచుకున్నాడు సచిన్. కీపర్ గా ధోనీ ప్రపంచంలోనే నెంబర్ వన్ అని చెప్పే సచిన్.. వరల్డ్ కప్ లో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ధోనీ తడబడ్డాడంటూ ఇప్పటికే విమర్శించిన సంగతి తెల్సిందే.
ఇక ఐసీసీ మొన్న ప్రకటించిన వరల్డ్ కప్ జట్టులో కోహ్లీ కి స్థానం కల్పించలేదు. అదేవిధంగా ఇండియా నుంచి ఇద్దరికే అవకాశం కల్పించారు. కానీ, సచిన్ ఐదుగురు భారత ఆటగాళ్లకి తన టీం లో చోటు కల్పించాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడు రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా సచిన్ జట్టులో ఉన్నారు. ఇక కెప్టెన్ గా ఈ వరల్డ్ కప్ లో అందరి మనసులనూ గెలుచుకున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నే సచిన్ కూడా ఎంచుకున్నాడు.
సచిన్ ప్రపంచకప్ జట్టు ఇదే!
రోహిత్ శర్మ, జానీ బెయిర్ స్టో (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (సారథి), విరాట్ కోహ్లీ, షకిబ్ అల్ హసన్, బెన్స్టోక్స్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మిచెల్ స్టార్క్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్