వరల్డ్ కప్ సెమీస్ సమరం దగ్గరకు వచ్చేసింది. కప్ పోరాటం చివరికి చేరింది. నాలుగు టీములు.. మూడు మ్యాచులు.. ఒక్క విజేత! ఇదీ ఈక్వేషన్. ఇక ఆ ఒక్కరూ ఎవరనే అంచనాలు మొదలైపోయాయి. సాధారణ అభిమానుల దగ్గర నుంచి సెలబ్రిటీ ల వరకూ అందరూ ఎవరి అంచనాలలో వారున్నారు. ఇందులో తాజాగా దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ చేరాడు. ఇపుడు ఎవరో ఒకరి వైపు మాట్లాడాల్సిందే కదా అంటూ తన మనసులో మాట చెప్పాడు. భారత్-ఇంగ్లండ్ జట్లే ఫైనల్లో తలపడుతాయని తాను నమ్ముతున్నానన్నాడు. నమ్మకమే కాదు అదే జరుగుతుందని జోస్యం చెప్పాడు. కీలక పరిస్థితుల్లో తాను ఎదో ఒక జట్టుకు మద్దతుగా నిలవక తప్పదన్నాడు. ఇక వరుస ఓటములతో సతమతమవుతున్న న్యూజిలాండ్ను ఓడించిన భారత్కు పెద్ద కష్టమైన పనేం కాదని అభిప్రాయపడ్డాడు. అలాగే ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ ఓడిస్తుందని తెలిపాడు. ఇక ఆసీస్ ఓటమితో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో భారత్ సెమీస్ ప్రత్యర్థిగా న్యూజిలాండ్ ఖరారు కాగా.. ఆసీస్.. ఇంగ్లండ్తో ఆడనుంది.
ఫైనల్ ఈ రెండు జట్ల మధ్యే!
క్రికెట్ డైహార్డ్ ఫ్యాన్, గూగుల్ సీఈవో సుంధర్ పిచాయ్ సైతం ఫైనల్లో తలపడేవి భారత్- ఇంగ్లండేనని తెలిపారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు కూడా బలమైన జట్లేనని, కానీ వీటితో జరిగే పోరులో ఇంగ్లండ్, భారత్లే పైచేయి సాధిస్తాయని పేర్కొన్నారు.