ధనా ధన్ ధోనీ! ఈపేరు వింటేనే టీమిండియా క్రికెట్ ప్రేమికులు ఊగిపోతారు. ధోనీ ఎన్నోఏళ్లుగా భారత క్రికెట్ మూలస్తంభంలా నిలిచాడు. తన వలన జట్టుకు ఎంతవరకూ ప్రయోజనం అనే దానిపై చక్కని క్లారిటీ ఉన్న ఆటగాడు. తన ఆటతీరు టెస్ట్ లకు సరిపోవడం లేదని భావించిన వెంటనే.. ఆ ఫార్మేట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆదర్శప్రాయుడు.
ఇప్పుడు ధోనీ పరిమిత ఓవర్ల ఆటతీరుపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. మునుపటి వేగం తగ్గిందంటూ కొందరు అదేపనిగా మాట్లాడుతున్నారు. ధోనీ రిటైర్ అయితే మంచిదని కొందరు.. లేదు ఇంకొన్ని రోజులు ఆడాలని మరికొందరు నిత్యం మాట్లాడుతూనే ఉన్నారు. వరల్డ్ కప్ సెమీస్ లో ధోనీ ఆటతీరు చూశాకా చాలామంది ధోనీ విలువైన ఆటగాడన్న విషయాన్ని ఒప్పుకున్నారు. వరల్డ్ కప్ నుంచి బయటకు రాగానే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే, వాటిని ధోనీ కొట్టిపారేశాడు. ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ధోనీ రిటైర్మెంట్ విషయమే చర్చగా ఉంది.
అయితే, ఈ విషయంలో ధోనీ తల్లిదండ్రులు కూడా తమ కుమారుడు రిటైర్ అయితేనే మంచిదని భావిస్తున్నారట. ఈ విషయాన్ని ధోనీ పర్సనల్ కోచ్ కేశవ్ బెనర్జీ స్వయంగా చెప్పారు. తాను వారింటికి వెళ్లి మాట్లాడానని, ఇక క్రికెట్ ను విడిచి, తమతో పాటు ఇంట్లో ఉండాలని వారు భావిస్తున్నారని అన్నారు. తాను మాత్రం మరో ఏడాది ఆడి, టీ-20 ప్రపంచకప్ తర్వాత రిటైర్ మెంట్ ప్రకటిస్తే బాగుంటుందని వారికి సర్ది చెప్పానని అన్నారు. వారు మాత్రం వెంటనే తప్పుకోవాలనే భావిస్తున్నారని ఆయన తెలిపారు. ఇపుడు ధోనీ ఏం చేస్తాదనేదే ఆసక్తిగా మారింది.