వరల్డ్ కప్ టోర్నీ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్నా మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ రెచ్చిపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆ జట్టు బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకు పడింది. తొలుత జేసన్ రాయ్ (153 ), బెయిర్ స్టో (51), తరువాత బట్లర్ (64 ), మోర్గాన్(35 ) ల బాదుడుతో ఆరు వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ దూకుడు చూస్తే 400 పరుగులు దాటేటట్టు కనిపించింది కానీ, చివరి ఐదు ఓవర్లలో బంగ్లా బౌలర్లు ఇంగ్లాండ్ ను కట్టడి చేయగలిగారు. బ్యాటింగ్ ప్రారంభించిన తొలి ఐదు ఓవర్లలో ఆచి తూచి ఆడిన ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ తరువాత చెలరేగిపోయారు. ఓపెనర్లిద్దరూ స్కోరు బోర్డును పరిగెత్తించారు. ఈ క్రమం లో 51 పరుగులు చేసిన తరువాత బెయిర్ స్టో ఔటయ్యాడు. తర్వాతా వచ్చిన రూట్ చక్కని సహకారం అందించడంతో జేసన్ రాయ్ వన్డేల్లో తొమ్మిదో శతకం పూర్తి చేసుకున్నాడు. 32 వ ఓవర్లో రూట్ అవుటయ్యాడు. తరువాత వచ్చిన జోస్ బట్లర్ సహాయంతో రాయ్ 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తర్వాతా వేగం పెంచే క్రమం లో మెహదీ హసన్ వేసిన 35వ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది హ్యాట్రిక్ నమోదు చేశాడు. నాలుగో బంతినీ స్టాండ్స్లోకి తరలించే క్రమంలో మొర్తజాకు క్యాచ్ ఇచ్చాడు. అటు తరువాత మోర్గాన్ ధాటిగా ఆడాడు. మెహదీ హసన్ వేసిన 46.5వ బంతికి భారీ సిక్సర్ బాదబోయిన మోర్గాన్(35; 33 బంతుల్లో) సౌమ్య సర్కార్కు క్యాచ్ ఇచ్చాడు. చివర్లో వచ్చిన బ్యాట్స్ మెన్ కూడా పరుగులు రాబట్టారు. కానీ, అనుకున్నంత వేగంగా పరుగులు చేయలేకపోవడం తో 386 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లాదేశ్ విజయ లక్ష్యం 387 .