వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా అఫ్గానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. టోర్నీలో తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న బంగ్లాదేశ్ ఈ విజయం తో సెమీస్ రేస్ లో తన స్థానాన్ని సజీవంగా ఉంచుకుంది.
టాస్ ఒడి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ అఫ్గానిస్థాన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కుని గౌరవప్రదమైన స్కోరును చేసింది. ఇదే పిచ్ పై అఫ్గానిస్థాన్ టీం తో టీమిండియా ముప్పుతిప్పలు పడి గెలిచింది. అయితే, బంగ్లాదేశ్ మాత్రం ఏడు వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది.
మొదట ముష్ఫికర్ రహీమ్, షకిబ్ అల్హసన్ (51 69 బంతుల్లో 1×4) రాణించడంతో బంగ్లా 50 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసింది. ముజీబ్ రెహ్మాన్ (3/39) గట్టి దెబ్బ తీసినా.. వీళ్లిద్దరూ రాణించడంతో బంగ్లా మెరుగైన స్కోరు సాధించింది. అనంతరం షకిబ్ (5/29), ముస్తాఫిజుర్ (2/32)ల ధాటికి అఫ్గాన్ 47 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో గుల్బాదిన్ నైబ్ (47), షెన్వారి (49) మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్లు నైబ్, రహ్మత్ షా (24)లతో పాటు అస్ఘర్ (20), నబి (0), నజీబుల్లా (23)ల వికెట్లను పడగొట్టి అఫ్గాన్కు విజయం వైపు చూసే అవకాశాన్ని కూడా షకీబ్ ఇవ్వలేదు. షకీబ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఇక, టోర్నీలో 7 మ్యాచ్ లు ఆడిన బంగ్లా దేశ్ జట్టు మూడు మ్యాచ్ లు గెలిచి, ఒక మ్యాచ్ వర్షం కారణం గా రద్దవడంతో 7 పాయింట్లతో పట్టికలో 5 వ స్థానాన్ని చేరుకుంది.