వరల్డ్ కప్ టోర్నీలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్ అఫ్రిదీ విజృంభించాడు . ఆరు ఓవర్లు వేసిన అఫ్రిదీ కేవలం తొమ్మిది పరుగులు ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు ఇక్కట్లలో పడింది. రెండో ఓవర్లోనే గుఫ్తిల్ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ ను విలియమ్సన్ మన్రోతో కలిసి నిలిపే ప్రయత్నం చేశాడు. కానీ, ఇన్నింగ్స్ ఎడో ఓవర్లో జోరుమీదున్న మన్రో(12; 17బంతుల్లో) షాహీన్ అఫ్రిది బౌలింగ్లో.. స్లిప్లో ఉన్న సోహైల్ చేతికి చిక్కాడు. దీంతో క్రీజులోకి రాస్ టేలర్ వచ్చాడు. తక్కువ పరుగుల వ్యవధిలోనే ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఇక కివీస్ను ఆదుకోవాల్సింది క్రీజులో ఉన్న విలియమ్సన్- రాస్ టేలర్ జోడీనే. విండీస్తో జరిగిన గత మ్యాచ్లో గొప్ప పోరాట ప్రతిమ చూపిన ఈ జోడీ.. పాక్తో మ్యాచ్లోనూ అదే కొనసాగిస్తారని అందరూ ఆశించారు. అయితే ఆఫ్రిదీ వీరి ఆశలను గల్లంతు చేశాడు. ఇన్నింగ్స్ 9 వ ఓవర్.. షాహీన్ అఫ్రిది బౌలింగ్లో ఆఖరి బంతిని ఎదుర్కొన్న టేలర్(3; 8బంతుల్లో) సర్ఫరాజ్ చేతికి చిక్కాడు. దీంతో న్యూజిలాండ్ మరింత కష్టాల్లో పడింది. వెంటనే వచ్చిన లేథమ్(1; 14బంతుల్లో) అఫ్రీది వేసిన పదమూడో ఓవర్ మూడో బంతికి సర్ఫరాజ్ చేతికి చిక్కాడు. మొత్తమ్మీద న్యూజిలాండ్ పదిహేను ఓవర్లు పూర్తయేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి.. 48 పరుగులు చేసింది. విలియమ్సన్ 24 పరుగులతోనూ, నీషం ఒక్క పరుగుతోనూ క్రీజులో ఉన్నారు.