ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ నివాసంలో కరోనా కలకలం రేగింది. కరణ్ జోహార్ నివాసంలో పనిచేస్తున్న ఇద్దరికి కరోనా సోకింది. సోమవారం జరిపిన కోవిడ్ పరీక్షలో తన ఇంటి స్థాఫ్ ఇద్దరికి కరోనా నిర్ధారణ అయ్యిందని స్వయంగా కరణ్ తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ రూల్స్ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
మా ఇంట్లో పనిచేసే స్టాఫ్లో ఇద్దరికి కోవిడ్-19 పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. వారిలో లక్షణాలు కనిపించిన వెంటనే మా ఇంట్లోని ఒక గదిలో వారిని క్వారంటైన్లోకి పంపాం. బృహత్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (BMC)కి తక్షణమే ఈ విషయాన్ని తెలియజేశాం. నా భవనం మొత్తాన్ని రసాయనాలతో శుభ్రం చేశారు. నిబంధనల ప్రకారం క్రిమిరహితం చేశారు. మిగతా ఇంటి సభ్యులకు, సిబ్బంది ఎవరికీ కరోనా సోకలేదని అందరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మా ఇంట్లో వాళ్లందరం రానున్న 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటాం. కరోనా సంక్షోభంలో ప్రతీ ఒక్కరం ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటిస్తే కరోనాను ధీటుగా ఎదుర్కోవచ్చు. కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి అంటూ కరణ్ ట్వీట్ చేశారు.