బిగ్ బాస్ ప్రసారంపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై హైకోర్టు విచారించింది. బ్రాడ్ కాస్టింగ్ నిబంధనలకు విరుద్ధంగా బిగ్ బాస్ షో ప్రసారాలు చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. సినిమా లాగే బిగ్ బాస్ షోను కూడా సెన్సార్ చేసి ప్రసారం చేయాలని పిటిషనర్, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి కోరారు. ఈ రియాలిటీ షో ద్వారా పిల్లలు, యువత చెడుమార్గంలో వెళ్లే అవకాశం ఉందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. సెలెక్షన్లో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని బాగ్ బాస్ షోను నిలిపివేయాలని కోరారు. హోస్ట్ నాగార్జున, స్టార్ మా, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం కామర్స్, జిల్లా కలెక్టర్, డీజీపీ, హైదరాబాద్ సీపీలను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. సోమవారం ఈ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.