సీఎం కేసీఆర్ తో భేటి అయిన సినీ రంగ ప్రముఖులు
లాక్ డౌన్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. ఇందులో సినిమా ఇండస్ట్రీ ఒకటి.. సినిమా షూటింగ్ లు వాయిదా పడ్డాయి.
లాక్ డౌన్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. ఇందులో సినిమా ఇండస్ట్రీ ఒకటి.. సినిమా షూటింగ్ లు వాయిదా పడ్డాయి. విడుదలకి సిద్దం అయిన సినిమాలు కూడా ఆగిపోయాయి. ధియేటర్లు కూడా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ భవిష్యత్తుపై నిన్న (గురువారం) సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసానితో సినీ ప్రముఖులు భేటి అయిన సంగతి తెలిసిందే.. ఈ భేటిలో మంత్రి తలసానితో చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, దిల్ రాజు, రాజమౌళి, ఎన్ శంకర్, సి. కళ్యాణ్, కొరటాల శివ, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అందరి అభిప్రాయాలు తీసుకుని షూటింగులు, థియేటర్ల పునఃప్రారంభంపై ముందుకు వెళ్తామని తెలిపారు. షూటింగుల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించామని చెప్పారు. సినిమాల చిత్రీకరణపై ప్రాధాన్యాతలు గుర్తించాలని, వాటిపై మరింత చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఇక సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి నిన్న వెల్లడించారు.
ఇక ఇది ఇలా ఉంటే కొద్ది సేపటి క్రితం తలసాని ఆధ్వర్యంలో సినీ రంగంలోని ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్ని కలిసారు. సినిమా షూటింగ్లు, థియేటర్ల ప్రారంభం విషయం పైన ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చ జరుపుతున్నారు. అవుట్డోర్, ఇండోర్ షూటింగ్లు జరిగే ప్రాంతాల్లో తీసుకునే ముందస్తు జాగ్రత్తలను వివరిస్తూ ఓ మాక్ వీడియోని కేసీఆర్ ముందు ప్రజెంట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపైన ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.