కన్నడ సినీ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా పేరు తెచ్చుకున్న సినిమా 'కేజీఎఫ్'. ప్రముఖ కన్నడ నటుడు యశ్ కథానాయకుడిగా నటించిన 'కేజీఎఫ్' పీరియడ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషలలో విడుదల చేశారు. అన్నీ భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. శాండలవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతోంది అని తెలిసిన విషయమే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండో భాగం చిత్రీకరణ ఈరోజు ప్రారంభమైంది.
తాజాగా బెంగళూర్ లోని విజయనగర్ ప్రాంతంలో ఉన్న కొండండ్రం గుడిలో రెండో భాగమైన 'కేజీఎఫ్: చాప్టర్ 2' చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హీరో యశ్తో పాటు హీరోయిన్ శ్రీనిధి శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్, తదితరులు హాజరయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో కేజీఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రితేశ్ సిధ్వానీ, వారాహి చలన చిత్ర సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ కీలక పాత్రలో నటిస్తున్నారు అని తెలుస్తోంది.