షారుక్ 'బేతాళ్' పైన చెలరేగిన వివాదం
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తెరకెక్కిస్తున్న బేతాళ్ వెబ్ సిరీస్ పైన వివాదం నెలకొంది
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తెరకెక్కిస్తున్న బేతాళ్ వెబ్ సిరీస్ పైన వివాదం నెలకొంది. హర్రర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ గత వారం ఆన్లైన్లో రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ పైన వివాదం నెలకొంది. తమ సినిమా 'విటాళ్' కథకు ఈ వెబ్ సిరీస్ కీ పోలికలు ఉన్నాయని మరాఠీ స్క్రీన్ రైటర్స్ సమీర్ వాడేకర్, మహేష్ గోసావి ముంబై కోర్టును ఆశ్రయించారు.
అంతేకాకుండా ఈ కథని స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్లో (ఎస్డబ్ల్యూఏ) రిజిస్టర్ చేసుకున్నామని వెల్లడించారు. ఈ మేరకు ఎస్డబ్ల్యూఏకు ఫిర్యాదు చేశామని అన్నారు. దాదాపుగా మా కథలో, ఈ వెబ్ సిరీస్ లో పది సన్నివేశాలు ఒకేలా ఉన్నాయని, మా ఐడియా గురించి వారికి ఎలా తెలిసిందో అర్థం కావడం లేదంటూ వాపోయారు. పాట్రిక్ గ్రాహం, నిఖిల్ మహాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో వినీత్ కుమార్, అహానా కుమార్, సుచిత్ర పిళ్లై, జితేంద్ర జోషి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
అడవుల్లో నివసిస్తున్న ప్రజల్ని మరో చోటుకి తరలించి, అక్కడ హైవే ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తారు. అందుకోసం ఆర్మీ అక్కడి వెళ్లడం.. బేతాళ్ కొండల్లో ఉన్న దెయ్యాల్ని ఎదుర్కోవాల్సి రావడం.. దెయ్యాలు ఆర్మీ అధికారుల శరీరాల్లోకి చేరి ప్రాణాలకు హాని చేయడం.. ఈ నేపథ్యంలో సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్ 24 మే 2020 న నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతుంది.