విలక్షణ నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కు చెన్నై పోలీసులు నోటీసులు జారీ చేశారు.. ఇటివల వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2' సినిమా సెట్లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.. ఈవీపీ ఫిల్మ్ సిటీలో బుధవారం రాత్రి షూటింగ్ స్పాట్లో క్రేన్ కింద పడటంతో ముగ్గురు వ్యక్తులు (మధు(29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34), చంద్రన్ ) మృతిచెందగా, మరో పది మందికి గాయాలు అయ్యాయి. అయితే మృతిచెందిన వారి కుటుంబాలకు కమల్ హాసన్ కోటి రూపాయల ఆర్థికసాయం ప్రకటించారు.
ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న10 మందిని పరామర్శించిన కమల్ వారికి ఒక్కొక్కరికి రూ. 50 లక్షల ఇస్తున్నట్లు చెప్పారు. లైకా పోడక్షన్ సంస్థ కూడా వారికి సాయం అందిస్తోంది. దర్శకుడు శంకర్ కూడా సాయం అందిస్తానని హామీ ఇచ్చారు అయితే ఈ సంఘటనపైన చెన్నై పోలీసులు లైకా సంస్థ యజమానితో పాటు, సినీ నిర్మాతలు, క్రేన్ యాజమాని, ఆపరేటర్లపై ఐపీసీ సెక్షన్ 287, 377 పలు కేసులు నమోదు చేశారు.
శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా 1996 లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం భారతీయుడుకు ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తోంది. సంవత్సరం క్రితం సినిమా ప్రారంభం అయింది. కానీ షూటింగ్ మాత్రం సీరియస్ గా జరగడం లేదు. అయితే ఈ నెలలో ఈ సినిమా కోసం భారీ సెట్స్ ఏర్పాటు చేశారు. షూటింగ్ వేగం పుంజుకున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చిత్ర బృందానికి షాక్ కలిగించింది. కాగా ఈ సినిమా కోసం కమల్ ఎక్కువ కాల్ షీట్స్ ఇచ్చారు. సినిమాని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.