కరోనా నుంచి కోలుకున్న కనికా.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్!
ప్రముఖ బాలీవుడ్ గాయనీ కనికా కపూర్ కి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే..
ప్రముఖ బాలీవుడ్ గాయనీ కనికా కపూర్ కి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే.. లండన్ నుంచి మార్చి 9న ఉత్తర ప్రదేశ్ వచ్చిన కనికా కపూర్ హోటల్లో బస చేసింది. ఆ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను ఆమె కలవడమే కాకుండా పార్టీ కూడా చేసుకున్నారు. కరోనా సోకినట్లు తేలడంతో సంచలనం రేగింది. ఆ తర్వాత ఆమెను క్వారంటైన్లోకి పంపించారు. ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా పార్టీలకు వెళ్ళడం వలన ఆమెపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
ప్రస్తుతం ఆమె ఉత్తర ప్రదేశ్ రాజధాని లఖ్నవూలో ఉన్న సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇనిస్టిట్యూల్ ఆఫ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. చికిత్సలో భాగంగా ఆమెకి నాలుగు సార్లు టెస్టు చేయగా అన్ని సార్లు పాజిటివ్ అనే తేలింది. దీనితో ఆమె కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఇక ఐదోసారి చేసిన కోవిడ్-19 టెస్టులో ఆమెకు నెగిటీవ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వ్యైదులు వివరించారు.
అయితే రిపోర్టులలో నెగిటివ్ అని వచ్చినప్పటికీ మెరుగైన ఆరోగ్యం కోసం మరికొంత కాలం ఆమె ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. తాజాగా సోమవారం ఆమెకి ఆరోసారి కరోనా పరీక్ష చేయగా ఆమెకి నెగిటివ్ అని వచ్చింది.నేడు హాస్పిటల్ నుండి ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆమె కొన్నిరోజులు ఇంటి సభ్యులకు దూరంగా ఉండడంతో పాటు, తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా డాక్టర్స్ సూచించినట్లు సమాచారం.. ఇక కరోనా నుంచి కనికా కొలుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.