'పలాస' మూవీ డైరెక్టర్ కి బంపర్ ఆఫర్
'పలాస 1978' మూవీ డైరెక్టర్ కరుణ కుమార్ కి లక్కి ఛాన్స్ వచ్చేసింది. తన రెండో చిత్రాన్ని ఏకంగా గీతా ఆర్ట్స్ లో చేసే ఛాన్స్ వచ్చింది.
'పలాస 1978' మూవీ డైరెక్టర్ కరుణ కుమార్ కి లక్కి ఛాన్స్ వచ్చేసింది. తన రెండో చిత్రాన్ని ఏకంగా గీతా ఆర్ట్స్ లో చేసే ఛాన్స్ వచ్చింది. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రక్షిత్, నక్షత్ర ప్రధానపాత్రలు పోషించారు. ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె మరో కీలక పాత్రలో మేరిశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే చిత్రబృందం కోరిక మేరకు నిర్మాతలు అల్లు అరవింద్, బన్ని వాస్లు మూవీ ప్రివ్యూ షో చూశారు.
సినిమా బాగా నచ్చడంతో సినిమాకి దర్శకత్వం వహించిన కరుణ కుమార్ దర్శకత్వ ప్రతిభను పొగుడుతూ తన రెండో సినిమా గీతా ఆర్ట్స్ వంటి భారీ నిర్మాణ సంస్థలో చేయమని, అడ్వాన్స్గా ఓ చెక్ కూడా ఇచ్చారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి 6న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. రఘు కుంచె ఈ సినిమాకు సంగీతం అందించారు.
స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించే గీతా ఆర్ట్స్, చిన్న హీరోలతో సినిమాలను నిర్మించేందుకు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ని స్థాపించింది. ఈ బేనర్ బాధ్యతలన్నింటిని బన్నీ వాసు చూసుకుంటున్నారు. ఇప్పటికే ఈ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా వచ్చిన ప్రతిరోజూ పండగే చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ప్రస్తుతం అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది ఈ సంస్థ..