టీడీపీ ప్రభుత్వంపై సీఎస్కు లేఖాస్త్రం సంధించింది వైసీపీ. ఇజ్రాయిల్కు చెందిన సంస్ధకు 12 కోట్ల 5 లక్షల రూపాయలు చెల్లించే ప్రయత్నాలు అడ్డుకోవాలంటూ ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేసేందుకు ఇజ్రాయిల్ నుంచి ఈ పరికరాలను కొనుగోలు చేశారని ఆయన లేఖలో ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం పెండింగ్ బిల్లులకు డబ్బు చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తోందంటూ ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సీఎస్ కు లేఖ రాశారు. ఇజ్రాయిల్కు చెందిన వెరిన్ట్ సంస్ధ నుంచి వెబ్ ఇంటెలిజెన్స్ , సాఫ్ట్ వేర్ తదితర టెలిఫోన్ పరికరాలను 12 కోట్ల 5 లక్షల రూపాయలకు అక్రమంగా కొనుగోలు చేసిందని ఆరోపించారు.
వెరిన్ట్ సంస్ధ నుంచి టెలిఫోన్ పరికరాలను నిబంధనల ప్రకారం కొనుగోలు చేయలేదని, హడావిడిగా తీర్మాణం ఆమోదించారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించిన బిల్లు డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిందని, పీఏఓ ఆమోదం కోసం వచ్చిన ఈ బిల్లును నిలిపివుంచాలని కోరారు. తమ ఫోన్లు ట్యాపింగ్ చేసేందుకు ఈ టెలిఫోన్ పరికరాలను ప్రభుత్వం కొనుగోలు చేసిందంటున్నారు వైసీపీ నేతలు. టెలిఫోన్ పరికరాల సంబంధింత ఫైల్ లో ఐఎంఎస్ ఐ క్యాచర్స్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదని, కేవలం వెబ్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ వివరాలు మాత్రమే ఇచ్చి అధికారులు తప్పుదోవ పట్టించారని విజయసాయి రెడ్డి లేఖలో వివరించారు. కొత్త ప్రభుత్వంలో వచ్చేలోగా వెరిన్ట్ సంస్థకు బిల్లును చెల్లించరాదని కోరారు.