వైసీపీలో తనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయన్న వంగవీటి రాధాకృష్ణ ఆరోపణలకు ఆ పార్టీ కౌంటర్ ఇచ్చింది. జగన్పై రాధా చేసిన ఆరోపణల్లో నిజం లేదని వైసీపీ నేత పేర్ని నాని చెప్పారు. రంగా విగ్రహావిష్కరణకు జగన్ ఏనాడూ అడ్డు చెప్పలేదన్న పేర్ని నాని ఏ ఊరు వెళ్ళినా కార్యకర్తలను కలవాలని మాత్రమే చెప్పారని వివరించారు. రాధా చంద్రబాబు ట్రాప్లో పడ్డారని విమర్శించారు. రాధాతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. వంగవీటి రంగా హత్యకు టీడీపీనే కారణమని అందరికి తెలుసన్నారు. రాధాకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదనటం సరికాదన్నారు. రాధాకు ప్రాధాన్యత ఇచ్చినందుకే దేవినేని నెహ్రూ పార్టీలో చేరలేదని తెలిపారు. ఆనాడు రాధా వద్దన్నారనే దేవినేని నెహ్రూను వైఎస్సార్ సీపీలో చేర్చుకోలేదని చెప్పారు.