ఏపీ మంత్రివర్గ విస్తరణకు ఇంకా ఒక రోజు గడువు మాత్రమే మిగిలి ఉంది. దీంతో అవావాహుల్లో టెన్షన్ అంతకంతకూ పెరిగిపోతోంది. కేబినెట్లో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై వైసీపీ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మిగతా నేతల సంగతి ఎలా ఉన్నా వైసీపీలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించే రోజాకు మంత్రి పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. మంత్రి పదవి అవకాశాలపై రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇచ్చేది ఇవ్వనది సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయిస్తారని రోజా అన్నారు. మంత్రి పదవి కావాలని ఇప్పటి వరకు తాను జగన్ మోహన్ రెడ్డిని అడగలేదని రోజా తెలిపారు. కాగా తాను పార్టీ కోసం ఎంతగా శ్రమించనో సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలుసునని చెప్పుకొచ్చారు.
తాను ఐరన్లెగ్ కాదని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై అలా దుష్ప్రచారం చేశారని చెప్పారు. ఇదిలా ఉంటే చిత్తురు జిల్లా నుండి ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డికి మంత్రి పదవులు దక్కనున్నయన్న వాదన బలంగా వినిపిస్తోంది. వీరిద్దరితో పాటు రోజాకు కూడా ఈ విడతలోనే మంత్రి పదవి దక్కుతుందా లేక ఈసారికి ఈ ఇద్దరితోనే సరిపెడతారా అనేది నేడు తేలిపోనుంది.