జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘోరం జరిగింది. గత అర్ధరాత్రి కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు యువకులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. దొంగలుగా భావించిన కాలనీ వాసులు వారిని చితక్కొట్టారు. దెబ్బలకు తాళలేక మెట్పల్లికి చెందిన సుదర్శన్ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహించిన మృతుని బంధువులు కాలనీలోని హరిహర చికెన్ సెంటర్ను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో మెట్టుపల్లి డీఎస్పీ గౌస్బాబా ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ముందస్తు చర్యగా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోరుట్లలో పోలీసులను మోహరింపజేశారు.