ఎన్నికల అనంతరం కూడా గన్నవరం నియోజకవర్గంలో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆరోపిస్తున్నారు. వంశీ వల్ల తనకు ప్రాణహాని ఉందని విజయవాడ సీపీకి యార్లగడ్డ ఫిర్యాదు చేశారు. తాను లేని సమయంలో వంశీ, అతని అనుచరులు ఇంటికి వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహరంపై వల్లభనేని వంశీ తన ఫేస్ బుక్ లో స్పందించారు. గతంలో యార్లగడ్డ ఎవరో తెలియకపోయినా తాను సాయం చేశాననని వల్లభనేని వంశీ చెప్పారు. తనపై నిరాధార ఆరోపణలు, విమర్శలు చేయకుండా ఉంటే తన నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.