వైసీపీలో చేరికలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నేతలు రోజుకోకరు చొప్పున లొటస్ పౌండ్ బాట పడుతున్నారు . ఇప్పటికే ఇద్దరు టీడీపీ ఎంపీలు పలువురు ఎమ్మెల్యేలకు కండువాలు కప్పిన జగన్ తాజాగా మరికొంత మందికి స్వాగతం పలికారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల బలమైన నేతలను ఆహానిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో బలమైన నేతగా ఉన్న కిల్లి కృపారాణి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైసీపీ అధినేత జగన్ అటు టీడీపీ ఇటు కాంగ్రెస్లలో బలమైన నేతలకు గాలం వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో 2 శాతం ఓట్ల తేడాతో పరాజయం పాలు కావడంతో ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ, కాంగ్రెస్లకు చెందిన నేతలను వ్యూహాత్మకంగా రొజుకొకరి చొప్పున చేర్చుకుంటున్నారు.
కాంగ్రెస్ తరపున ఉత్తరాంధ్రలో బలమైన నేతగా ఉన్న కిల్లి కృపారాణి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. జగన్తో భేటి అయిన ఆమె ఈ నెల 28న అమరావతి వేదికగా వైసీపీలో చేరుతానంటూ తెలియజేశారు. కళింగ వర్గానికి చెందిన కిల్లి కృపారాణి పార్టీలోకి రావడంతో వైసీపీ విజయావకాశాలు మరింత మెరుగుపడుతాయని పార్టీ కేడర్ భావిస్తోంది. ఇదే సమయంలో ఉత్తరాంధ్రతో కాంగ్రెస్కు మిగిలి ఉన్న ఏకైక నేత కూడా పార్టీని వీడినట్టు అయ్యింది.
ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలపై రోజుకో మాట పూటకో బాట పట్టిన చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం వల్లే పార్టీని వీడినట్టు ఆమె ప్రకటించారు. సినీనటుడు అక్కినేని నాగార్జున జగన్తో భేటి అయ్యారు. గుంటూరు నుంచి తన సన్నిహితుడికి టికెట్ కేటాయించాలంటూ ఆయన జగన్ను కోరినట్టు సమాచారం. రాజకీయ పరిణామాలతో పాటు ఇతర అంశాలపై జగన్తో అరగంట పాటు చర్చించారు.