మాచర్ల మ్యాటర్ టీడీపీకి తలనొప్పిగా మారింది. గుంటూరు జిల్లా మాచర్ల టిక్కెట్ను అంజిరెడ్డికి కేటాయించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు నిరసన బాట పట్టారు. నిన్నటి నుంచి కొనసాగుతున్న ఆందోళన ఇవాళ తీవ్రతరం అయ్యింది. చలమారెడ్డికే టిక్కెట్ కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. ప్లకార్డులతో నినాదాలు చేశారు.సీఎం చంద్రబాబు నివాసం ఎదుట చలమారెడ్డి వర్గీయులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన చేపట్టారు. అంజిరెడ్డి వద్దు చలమారెడ్డి ముద్దు అంటూ రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులు ప్రదర్శించారు. అంజిరెడ్డి ఎవరో నియోజకవర్గం ప్రజలకు కానీ ఎంపీ అభ్యర్థి రాయపాటికి కానీ తెలీదన్నారు. చలమారెడ్డికి మాచర్ల సీటు ఇవ్వకపోతే పార్టీకి, క్యాడర్కు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
గూగుల్లో వెతికినా అంజిరెడ్డి పేరు దొరకదంటూ కార్యకర్తలు ఎద్దేవా చేశారు. ఒకవేళ చలమారెడ్డి కాదని అంజిరెడ్డికే బీ ఫామ్ ఇస్తే ప్రత్యర్థిని ఎదుర్కోవడం కష్టమని పాతిక వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయం అని వార్నింగ్ ఇచ్చారు. చలమారెడ్డికి టిక్కెట్ కేటాయించే వరకు ఆందోళన ఆపబోయేది లేదని స్పష్టం చేశారు.