తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆపే ప్రసక్తే లేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కాళేశ్వరంతో పాటు దాని అనుబంధ ప్రాజెక్టు పనులపై ఎట్టి పరిస్థితుల్లో స్టే విధించలేమని తేల్చిచెప్పింది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై హైకోర్టులో దాఖలైన 175 పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించేందుకు ధర్మాసనం అంగీకరించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాళేశ్వరం, దాని అనుబంధ ప్రాజెక్టులకు అండంకులు తొలిగాయి. ప్రాజెక్టు విషయంలో దాఖలైన పిటిషన్లను గురువారం విచారించిన హైకోర్టు ప్రాజెక్టు నిర్మాణ పనులను కొనసాగించాలని ఆదేశించింది. ఇలాంటి కీలక సమయంలో పనుల నిలిపివేతపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం వహించరాదని బాధితులకు సత్వరం న్యాయం చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్, దాని అనుబంధ ప్రాజెక్టులపై హైకోర్టులో దాఖలైన 175 పిటిషన్ లను అన్ని కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది.
మరోవైపు మల్లన్నసాగర్ విషయంలోనూ హైకోర్టు అనుకూల ఆదేశాలు జారీ చేసింది. 4 వేల 108 ఎకరాల భూ సేకరణ విషయంలో ఇప్పటివరకు 4 వేల 61 ఎకరాలకు సంబంధించిన నష్టపరిహారం అందించినట్లు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్రావు తెలిపారు. 47 ఎకరాల్లో ఉన్న బాధితులు మాత్రమే స్వీకరించడంలేదని కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన చెక్లను కోర్టుకు డిపాజిట్ చేశారు. బాదితులందరికి న్యాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ కేవలం 47 ఎకరాల కోసం ఇంత పెద్ద ప్రాజెక్టు పనులు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయలేమని.. ధర్మాసనం తెలిపింది. నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం చెల్లించే నష్ట పరిహారంలో ఏమైనా అన్యాయం జరిగితే తమను ఆశ్రయించ వచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.