తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారాన్ని రేపుతున్న డేటా చోరీ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటుతో మరింత పీక్ స్టేజ్కు చేరుకుంది. ఇవాళ్టి నుంచే సిట్ రంగంలోకి దిగనుంది. మరి సిట్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది.? దీనికి కౌంటర్గా టీడీపీ సర్కారు ఏం చేయబోతోంది..? డేటా చోరీ అంశం రెండు రాష్ట్రాల మధ్య మరింత రాజుకుంది. ఐటీ గ్రిడ్పై సోదాలు దాని పర్యవసనాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లో ఈ అంశంపై రెండు కేసులు నమోదు కావడంతో వీటిని ఒకేసారి దర్యాప్తు చేయాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. సిట్ ఏర్పాటుతోనే ఈ కేసుల దర్యాప్తును పూర్తి చేయొచ్చని లేఖలో పేర్కొన్నారు. దీనిపై వెంటనే స్పందించిన తెలంగాణ సర్కారు ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది.
ఇటు సిట్ బృందంలోని సభ్యులను ఇవాళ హైదరాబాద్ రావాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉదయం స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్ టీమ్ డీజీపీ మహేందర్రెడ్డితో సమావేశం కానుంది. వీరి భేటీ తర్వాత మధ్యాహ్నం ఈ అంశంపై డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడనుండటంతో విషయం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుతో హోంశాఖ ఉన్నతాధికారులు భేటీ కావడం కీలకంగా మారింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి అనురాధ, డీజీపీ ఠాకూర్ చంద్రబాబుతో సమావేశం అయ్యారు. టీడీపీ సమాచారాన్ని అక్రమంగా వైసీపీకి చేరవేస్తున్నారనే ఆరోపణల నేపత్యంలో తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెట్టాలనే యోచన చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ పోలీసులపై టీడీపీ బృందం గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేయగా న్యాయపరంగా మరింత ముందుకు ఎలా వెళ్లాలనే దానిపై కూడా చర్చ జరిపారు.