టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం కావడం ఖాయం అని టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్ జోస్యం చెప్పారు. ఇక కేవలం ఆ ముగ్గురు మాత్రమే మిగులుతారని, మిగిలిన వారంతా గూలాబీ గూటికికే వస్తారని అన్నారు. వచ్చే నాలుగైదు రోజుల్లో టీఆర్ఎస్లోకి సీఎల్పీ విలీనం ప్రక్రియ పూర్తి అవుతుందని దీనికి సంబంధించి న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు వివరించారు. మండల, జడ్పీ పరిషత్ ఎన్నికల కోసం బీ ఫామ్స్ తీసుకునేందుకు టీఆర్ఎస్ ఎల్పీకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్ బీ ఫామ్స్ తీసుకున్నారు. వీరితో పాటు రాజేందర్రెడ్డి, ఆత్రం సక్కు, వొడితెల సతీష్ కూడా టీఆర్ఎస్ఎల్పీకి వచ్చారు.
కాగా కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా గల్లంతు చేయాలనే లక్ష్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర టీఆర్ఎస్లో చేరారు. తాజాగా మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి అధికార పార్టీకి సంకేతాలు అందాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, పొడెం వీరయ్య, జగ్గారెడ్డి గూలాబీ గూటికి చేరనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.