ఎగ్జిట్ పోల్ ఫలితాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఎన్డీయేకే ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టడంతో.. మార్కెట్లు పరుగులు తీశాయి. హంగ్ ప్రభుత్వానికి అవకాశం లేదని, మళ్లీ స్థిరమైన మోడీ సర్కారు అధికార పగ్గాలు చేపట్టనుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. ట్రేడింగ్లో 900 పాయింట్లు ఎగబాకింది.
కేంద్రంలో మరోసారి మోడీ సర్కార్ ఏర్పడుతుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో దేశీయ మార్కెట్లు దూసుకెళ్లాయి. ట్రేడింగ్ ఆరంభం నుంచే అతి భారీ లాభాలతో సూచీలు దూసుకెళ్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ దాదాపు 1422 పాయింట్లు ఎగబాకి 39వేల మైలురాయిని దాటింది. 2009 మే 18 తర్వాత సెన్సెక్స్ ఒక రోజులో ఇంత భారీగా లాభపడటం ఇదే తొలిసారి.
పదేళ్ల క్రితం 2009 మే 18న సెన్సెక్స్ చరిత్ర సృష్టించింది. ఒకే ఒక్క సెషన్లో రికార్డు స్థాయిలో 2,110 పాయింట్లు ఎగబాకింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం మార్కెట్లలో సరికొత్త హుషారు నింపింది. దీంతో ఆ రోజున సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఒక రోజులో 2000 పాయింట్లు లాభపడటం మళ్లీ ఇప్పటి వరకు జరగలేదు.
తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయారినికి 1421.90 పాయింట్ల లాభంతో బీఎస్ఈ సెన్సెక్స్ 39,352.67కు చేరుకుంది. 421 లాభంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,828.25 పాయింట్ల వద్ద ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు మార్కెట్లలో జోష్ నింపాయి. ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని మార్కెట్లు కొంత ఉత్సాహంగా ఉన్నాయి. దీనికి మిడ్క్యాప్,స్మాల్ క్యాప్షేర్ల దూకుడు జోరు పెంచింది.