వేలం వేస్తే ఏడాది జైలు.. ఆరేళ్లు అనర్హత
పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవాల పేరుతో వేలం పాట పాడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ప్రజాస్వామ్య పద్దతిలో సాగాల్సిన ఎన్నికలను అపహాస్యం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది.
పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవాల పేరుతో వేలం పాట పాడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ప్రజాస్వామ్య పద్దతిలో సాగాల్సిన ఎన్నికలను అపహాస్యం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. కోడ్ ఉల్లంఘనలపైనా స్పందించిన ఎస్ఈసీ అక్రమాలకు పాల్పడితే కేసులు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.
నామినేషన్ల ప్రక్రియకు ముందే కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవిని వేలం వేయడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా గ్రామాల్లో సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు వేలం ఘటనలపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కోడ్ ఉల్లంఘనలపై తీవ్రంగా స్పందించింది. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆరోపణలపై విచారణ జరుపుతామని ఒకవేళ వేలం పాట ద్వారా సర్పంచ్ పదవిని కొనుగోలు చేశారని రుజువైతే కేసులు నమోదు చేస్తామంటూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
అక్రమాలకు పాల్పడితే ఏడాది జైలు శిక్ష, ఆరేళ్లపాటు పోటీ చేయకుండా అనర్హత వేటు వేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. అక్రమాలు జరిగినట్లు ఎన్నికల ట్రైబ్యునల్ నిర్ధారిస్తే ఎన్నిక రద్దు చేస్తామని స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల్లో వేలం వేసే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆరోపణలపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులను ఆదేశించింది. ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లతే ఎన్నికను రద్దు చేస్తామంది.
ఈ మేరకు కలెక్టర్లు, పోలీసు అధికారులకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. పదవుల వేలానికి సంబంధించి మీడియాలో వచ్చే వార్తల పరిశీలనకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ వార్తలను పరిశీలించి విచారణ జరిపేందుకు జిల్లాల్లో సైతం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసంది. పదవుల వేలం బాధ్యులపై సత్వరమే విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. వేలానికి సంబంధించి ప్రాథమిక సమాచారం ఉంటే పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. మొత్తానికి యూనానిమస్ ఎన్నికలపై రిటర్నింగ్ అధికారులు ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికను ప్రకటించాలి. సంతృప్తి చెందాకే ఏకగ్రీవ ఎన్నిక ప్రకటనకు పరిశీలకులు అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘం పేర్కొంది.