ఒకరేమో మళ్లీ గడ్డు పరిస్థితి రిపీట్ అవుతుందంటున్నారు మరొకరేమో ఈ ఏడాది అంతా సంతోషమేనంటున్నారు ఒకరేమో లోటు వర్షపాతమంటున్నారు మరొకరేమో సమృద్ధిగా వర్షాలు పడతాయంటున్నారు ఒకవైపు సైన్స్ మరోవైపు జ్యోతిష్యం అసలు వీళ్లేమంటున్నారు చివరికి గెలిచేదెవరు?
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రైతన్నలు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని ప్రముఖ వాతావరణ సంస్థ స్కైమెట్ హెచ్చరించింది. ఎల్నినో ఎఫెక్ట్తో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రకటించింది. నైరుతి రుతుపవనాలకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవన్న స్కైమెట్ ఎల్నినో ఇండెక్స్ గరిష్ట విలువను అధిగమించి భయపెడుతోందని తెలిపింది. జూన్ ఫస్ట్ వీక్లో భారత్లోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలపై ఎల్నినో ఎఫెక్ట్ పడనుందని, దాంతో ఈ ఏడాది కూడా లోటు వర్షపాతమే నమోదయ్యే అవకాశముందని ప్రకటించింది. అంతేకాదు జూన్, జులైలో పరిస్థితి మరింత గడ్డుగా ఉంటుందని తెలిపింది.
ఈ ఏడాది లోటు వర్షపాతం ఉంటుందని, గడ్డు పరిస్థితులు వస్తాయని ప్రముఖ వాతావరణ సంస్థ స్కైమెట్ హెచ్చరిస్తుంటే ఉగాది పంచాంగకర్తలు మాత్రం ఈ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, బంగారు పంటలు పండి రైతులు సుఖసంతోషాలతో ఉంటారని చెబుతున్నారు. మరి స్కైమెట్ చెప్పినట్లు రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటారో లేక పంచాంగకర్తలు చెప్పినట్లుగా వర్షాలు సమృద్ధిగా పడి బంగారు పంటలు పండుతాయో చూడాలి.