ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు భరతజాతి అంతిమ వీడ్కోలు పలికింది. త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసింది. తిరిగిరాని లోకాలకు వెళ్లిన అమరులకు లాస్ట్ సెల్యూట్ చేసింది.
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. ప్రజలు, ప్రజా ప్రతినిధుల మధ్య కుటుంబ సభ్యుల కన్నీటి సాక్షిగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమరులైన జవాన్లకు నివాళ్లు అర్పించాయి. వీర మరణం పొందిన వారిని కీర్తిస్తూ జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ అమర జవాన్లకు సెల్యూట్ చేశారు. డెహ్రాడూన్ కు చేరుకున్న సీఆర్పీఎఫ్ ఏఎస్ ఐ మోహన్ లాల్ పార్థివ దేహాన్ని చూసి ఆయన కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తండ్రి మృతదేహానికి మోహన్ లాల్ కుమార్తె కడసారిగా సెల్యూట్ చేసింది. కన్నీటిని దిగమింగుకుని తండ్రి భౌతికకాయానికి ఆమె సెల్యూట్ చేసిన తీరు అక్కడివారిని కలిచివేసింది.
ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమరులైన జవాన్లకు ఘనంగా నివాళ్లు అర్పించాయి. భారీ సంఖ్యలో ప్రజలు జవాన్ల అంత్యక్రియలకు హాజరయ్యారు. వీరమరణం పొందిన వారిని కీర్తిస్తూ నినాదాలు చేశారు. జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ జవాన్లకు సెల్యూట్ చేశారు. మరోవైపు యూపీలోని ఉన్నావ్కు చెందిన అజిత్ కుమార్ ఆజాద్కు అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇటు బిహార్కు చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు 11 లక్షల పరిహారం ప్రకటించారు. కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య అమర జవాన్లకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇటు శనివారం రాత్రి వరకు జవాన్ల మృతదేహాలు వారి వారి స్వస్థలాలకు చేరుకున్నాయి. ఆయా భౌతికకాయాలకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.