ప్రధాని మోడీ ఇంటర్వ్యూపై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపేయినర్ ప్రియాంక గాంధీ విమర్శలతో దాడి చేశారు. నటులతో కాకుండా రైతులతో మాట్లాడాలని అప్పుడు ఎదురయ్యే ఘాటు ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. ఉత్తర్ప్రదేశ్లోని హమీర్పూర్ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమె అన్నదాతలతో మాట్లాడితేనే వారి కష్టాలు తెలుస్తాయని అన్నారు. మోడీ ప్రధాని అయ్యాక వారణాసి నియోజకవర్గంలోని పల్లెల్లో ఒక్కసారిగా కూడా పర్యటించలేదని చెప్పారు. కాగా, మోదీకి స్వాగతం పలికేందుకు తాగునీటిని రోడ్ల పాలు చేయడంపై ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ దేశానికి చౌకీదారా లేక చక్రవర్తా అంటూ మండిపడ్డారు. బుందేల్ఖండ్లో ప్రజలు తీవ్ర దుర్భిక్షంతో అల్లాడుతుంటే ప్రధాని రాక కోసం బందాలో తాగునీటిని పారబోయడమేంటని నిలదీశారు. ఈ వారం చివర్లో ప్రధాని బందా రానున్న నేపథ్యంలో ట్యాంకర్లతో నీటిని తీసుకొచ్చి రోడ్లు కడుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు.