టోల్గేట్ సిబ్బందిపై ఏపీ మంత్రి భార్య వీరంగం సృష్టించింది. ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య హల్చల్ చేసింది. మంత్రి భార్యనంటూ మాడ్గులపల్లి టోల్ఫ్లాజా సిబ్బందిపై చిందులేసింది. నేను మంత్రి భార్యను నా కారుకే టోల్ ఫీజు అడుగుతారా అంటూ సిబ్బందితో వాదనకు దిగింది. పైగా ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందని డబ్బులు ససేమిరా కట్టనంటూ బెదిరింపులకు పాల్పడింది.
అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి టోల్ప్లాజా వద్ద ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య, కుటుంబ సభ్యులు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. మంత్రి భార్య తన కారులో హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్నారు. మాడ్గులపల్లి టోల్ప్లాజా వద్ద టోల్ రుసుము చెల్లించాలని సిబ్బంది ఆమె కారును ఆపారు.దీంతో ఆగ్రహించిన ఆమె సిబ్బందితో గొడవకు దిగారు.
మీరు మంత్రికాదు ఎమ్మెల్యే కాదు కాబట్టి ఫీజు చెల్లించాల్సిందేనంటూ టోల్గేట్ సిబ్బంధి తేల్చిచెప్పారు. పైగా స్టిక్కర్ అనుమతి కాలపరిమితి దాటిందని టోల్ రుసుము చెల్లించకుంటే కారు వేళ్లేది లేదని స్పష్టం చేశారు. కారులో ఎమ్మెల్యే లేకపోవడంతో టోల్ప్లాజా సిబ్బంది ఆర్అండ్బీ రూల్స్ ప్రకారం టోల్ రుసుము చెల్లించాలని చెప్పారు. దీంతో మంత్రి భార్య, కుటుంబ సభ్యులు అరగంట సేపు టోల్ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఫీజు చెల్లించకపోతే కారును వెళ్లనిచ్చేదిలేదని సిబ్బంది తేల్చి చెప్పడంతో చివరకి టోల్ ఫీజు చెల్లించి బయటపడ్డారు. మంత్రి భార్య నిర్వాకంతో టోల్ప్లాజా వద్ద ట్రాఫిక్ జామైంది.