మీ పనితీరు భేష్.. ఈసీకి ప్రణబ్ ముఖర్జీ ప్రశంస

Update: 2019-05-21 06:40 GMT

భారత ఎన్నికల కమిషన్‌కు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కితాబిచ్చారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి ఈసీనే కారణమంటూ కొనియాడారు. సార్వత్రిక ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారని మెచ్చుకున్నారు. ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన తొలి సీఈసీ సుకుమార్‌ సేన్‌ నుంచి ఇప్పటి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ వరకు ప్రతీ ఒక్కరూ తమ విధులను గొప్పగా నిర్వహించారని అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈసీని ప్రశంసలతో ముంచెత్తారు.

అయితే ఈసీని నిందించడం సరికాదని హితవు పలికారు. కొందరు కావాలనే ఎన్నికల కమిషన్‌పై విమర్శలు చేస్తున్నారని విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి కార్మికుడు పనిముట్లను సజావుగా ఉపయోగిస్తాడని చెడ్డ కార్మికుడు పనిముట్లతో గొడవకు దిగుతాడని అన్నారు. దేశంలోని వ్యవస్థలన్నీ ఎన్నో ఏళ్లుగా బలంగా నిర్మించబడుతూ వస్తున్నాయని అన్ని కీలక వ్యవస్థలు అద్భుతంగా పని చేస్తున్నాయని ప్రణబ్‌ దాదా చెప్పారు.  

Similar News