రెండోసారి ప్రధాని పదవి చేపడుతున్న నరేంద్ర మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరగనుంది. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంతో పోల్చితే ఈ సారి ప్రమాణస్వీకారానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. తొలిసారిగా పలువురు అతిథులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వీరికోసం నోరూరించే వంటలు కూడా సిద్ధమవుతున్నాయి.
మరికొద్ది గంటల్లో నరేంద్రమోడీ దేశ ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నేతలతో పాటు 6వేల మంది అతిథులు రానున్నారు. మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా బిమ్స్టెక్ దేశాల అధిపతులకు ఆహ్వానాలు వెళ్లాయి. బిమ్స్టెక్ కూటమిలో బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్లు సభ్యదేశాలుగా ఉన్నారు. ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం ఇదే తొలిసారి గతసారి మోడీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల కూటమికి ఆహ్వానం అందింది.
వీరితో పాటు ఇటీవల చోటుచేసుకున్న అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన బీజేపీ కార్యకర్తల కుటుంబసభ్యులను కూడా మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇలా దివంగత కార్యకర్తల బంధువులను ఆహ్వానించడం కూడా ఇదే తొలిసారి. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో పలువురు బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన కార్యకర్తల బంధువులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ద్వారా మోడీ వారికి అండగా ఉన్నారన్న సందేశం ఇచ్చినట్లవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రమాణస్వీకారోత్సవానికి అతిథుల సంఖ్య కూడా భారీగానే ఉంది. దాదాపు 6500 మంది అతిథులు హాజరుకానున్నట్లు సమాచారం. 2014లో మోదీ తొలిసారిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు అతిథుల సంఖ్య ఐదు వేల వరకు ఉంది. మోడీ ప్రమాణానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇక ప్రమాణస్వీకారానికి వచ్చే అతిథుల కోసం ఈ సారి ప్రత్యేక వంటలు చేస్తున్నారట. భారతీయ సంప్రదాయ వంటలతో పాటు పాశ్చత్య ఘుమఘుమలు కూడా వడ్డించనున్నట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.
సాయంత్రం 7గంటలకు మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత అతిథులకు స్నాక్స్ ఏర్పాటు చేయనున్నారు.. అంతరం డిన్నర్లో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వెరైటీలతో పాటు రాష్ట్రపతి భవన్ పాపులర్ వంటకమైన దాల్ రైసినాను వడ్డించనున్నారు. మొత్తానికి మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అథితులకు కమ్మడి డిన్నర్ భోజనం కూడా రెడీ అవుతోంది.