జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, పార్టీ విజయావకాశాలపై పవన్ సమీక్షలు ప్రారంభించారు. ఇక తొలి విడత సమీక్షలో భాగంగా నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన అభ్యర్థులతో జనసేనాని సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ముఖ్య నేతలతో పవన్ చర్చించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల్లో గెలుపోటములపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. పోలింగ్ ముగిసిన దాదాపు 10రోజుల తర్వాత పార్టీ తరఫున మొదటి సమావేశం నిర్వహించారు పవన్. కాగా ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఎన్నికల్లో తమ పార్టీలకు వందకుపైగానే సీట్లు వస్తాయని జోరుగా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో అసలు జనసేన కచ్చితంగా ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందనే విషయంపైనా జనసేనాని ఓ అంచనాకు రానున్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో జనసేన మొత్తం 140 స్థానాల్లో పోటీకి దిగింది. మిత్రపక్షాలైన బీఎస్పీ 21, సీపీఐ, సీపీఎం 14 స్థానాల్లో పోటీచేశాయి. మొత్తం 175 స్థానాలకు జనసేన కూటమి పోటీచేసింది.